'జబర్దస్త్' షోలో గుర్తింపు తెచ్చుకున్న 'అదిరే' అభి (అభినయ కృష్ణ) గతంలో 'చిరంజీవా' సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు మలియత్నంగా 'కామాఖ్య' అనే సినిమాను తెరకెక్కించాడు. అయితే సెన్సార్ అభ్యంతరాలతో ఆ సినిమా పేరును 'కర్మాఖ్య'గా మార్చారు. తాంత్రిక విద్యల నేపథ్యంలో తెరకెక్కిన 'కర్మాఖ్య' ఎలా ఉందో చూద్దాం.
ఈశాన్య భారతంలో అతి ప్రాచీనమైనది కామాఖ్య దేవాలయం. అక్కడ తాంత్రికులకు కొదవలేదు. మూడు తరాల క్రితం ఓ కుటుంబం అక్కడి నుంచి ఆంధప్రదేశ్కు వస్తుంది. ఆ కుటుంబానికి సంబంధించిన కథే 'కర్మాఖ్య'. తాంత్రిక పూజలు చేస్తున్న ఆ కుటుంబ పెద్ద (మధునందన్)ను, అతని భార్యను గ్రామస్తులు చంపేస్తారు. వారి ఐదేళ్ళ పాప మాత్రం బతికి బయట పడుతుంది. ఇది జరిగిన పాతికేళ్ళకు ఇప్పటి కథ మొదలవుతుంది. కామాఖ్య (సమైరా), ప్రవల్లిక (శరణ్య ప్రదీప్) ఒకే హాస్టల్ లో ఉంటారు. ప్రవల్లిక ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తుంది. కామాఖ్య ఉద్యోగం పోగొట్టుకుని కొత్త జాబ్ కోసం ట్రై చేస్తుంటుంది. అటువంటి సమయంలో ఇన్యూరెన్స్ క్లయిమ్ చేసిన ఒకరి వివరాల సేకరణ కోసం ప్రవల్లిక బదులు కామాఖ్య వెళుతుంది. విశాఖ అవుట్కట్స్ లోని ఓ ఇంటికి వెళ్ళిన కామాఖ్యకు అక్కడి వ్యక్తులు, వారి ప్రవర్తన చిత్రంగా అనిపిస్తాయి. అక్కడ నుంచి వెంటనే తిరిగి వెళ్ళాలనుకుంటూ ఉండగా, వారు ఆమెను హౌస్ అరెస్ట్ చేస్తారు. ఊహించని విధంగా సిటీకి దూరంగా ఉన్న ఆ ఇంటిలో చిక్కుకుపోయిన కామాఖ్య అక్కడి నుంచి ఎలా బయట పడింది? అసలు ఆమెను ఆ ఇంటిలోని వాళ్ళు ఎందుకు బంధించారు? ఆమె నుంచి వాళ్ళు ఆశిస్తున్నదేమిటీ? కామాఖ్యను ఈ ఉచ్చులోకి లాగిన తెరవెనుక మనుషులు ఎవరు? అనేది మిగతా కథ.