అస్త్రం, కుత్బుల్లాపూర్:
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత ముఖ్యమో, ఆ ఓటు వేసేందుకు అవసరమైన పోలింగ్ కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉండటమూ అంతే ముఖ్యం. కిలోమీటర్ల దూరం ప్రయాణించలేక వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ఓటింగ్కు దూరమయ్యే పరిస్థితి ఉండకూడదన్న ఉద్దేశంతో కుత్బుల్లాపూర్లో కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం నాయకుల బృందం అధికారులకు వినతిపత్రం సమర్పించింది.
ఉమ్మడి గాజులరామారం డివిజన్ నుంచి కొత్తగా ఏర్పడిన మహాదేవపురం, గాజులరామారం, రోడామేస్త్రీనగర్ డివిజన్ల పరిధిలో ప్రజలకు అనుకూలమైన ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఉమ్మడి గాజులరామారం డివిజన్ అధ్యక్షుడు సాయినాథ్ నేత ఆధ్వర్యంలోని బృందం కోరింది. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్కు వినతిపత్రాన్ని అందజేసింది.
కైలాష్హిల్స్, షిరిడీహిల్స్, మహాదేవపురం ప్రాంతాల ఓటర్ల కోసం బ్రైట్ విల్లే స్కూల్లో కొత్త పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. రవినారాయణరెడ్డినగర్ ఫేజ్–1, 2, 3, 4తో పాటు కమలమ్మనగర్ ప్రజలకు వెంకటేశ్వరస్వామి ఆలయం వెనుకనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
లెనిన్నగర్, అంబేడ్కర్నగర్ ప్రాంతాలకు చైతన్య విద్యాలయ, సురభి స్కూల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. శ్రీరాంనగర్–ఏ, బీ, వల్లభాయ్పటేల్నగర్ ఓటర్ల సౌకర్యార్థం శ్రీరాంనగర్ కమ్యూనిటీ హాల్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతిపాదనలపై డిప్యూటీ తహసీల్దార్ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర యువ మోర్చా నాయకురాలు రేవతిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు సునీల్ పాటిల్, డివిజన్ సీనియర్ నాయకులు నరేష్గౌడ్, శారద తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదు. ప్రతి ఓటరినీ పోలింగ్ బూత్కు మరింత చేరువచేసే ప్రజాస్వామ్య బాధ్యత. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటే కొత్త డివిజన్ల ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుంది.