Telangana

అడ్డాకల్‌కు పవర్‌ బూస్ట్‌.. ఇక ఓవర్‌లోడింగ్‌కు చెక్‌!

అడ్డాకల్‌కు పవర్‌ బూస్ట్‌.. ఇక ఓవర్‌లోడింగ్‌కు చెక్‌!
  • 5 ఎంవీఏ స్థానంలో 8 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు
  • విజయవంతంగా ఛార్జింగ్‌ చేసి విద్యుత్‌ సరఫరాలోకి తీసుకొచ్చిన అధికారులు
  • వ్యవసాయ, గృహ, వాణిజ్య వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్‌

సామాన్యుడి అస్త్రం / అడ్డాకల్‌ : మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో విద్యుత్‌ మౌలిక సదుపాయాల బలోపేతానికి టీజీఎస్పీడీసీఎల్‌ మరో కీలక ముందడుగు వేసింది. అడ్డాకల్‌ 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రంలో ప్రస్తుతం ఉన్న 5 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ స్థానంలో అధిక సామర్థ్యం కలిగిన 8 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసింది. పనులు పూర్తయిన అనంతరం కొత్త పీటీఆర్‌ను విజయవంతంగా ఛార్జింగ్‌ చేసి విద్యుత్‌ సరఫరాలోకి తీసుకొచ్చారు.

పెరిగిన సామర్థ్యం.. తగ్గనున్న భారం

అడ్డాకల్‌తోపాటు పరిసర గ్రామాల్లో వ్యవసాయ కనెక్షన్లు, గృహ వినియోగం, వాణిజ్య అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్‌ డిమాండ్‌ కూడా గణనీయంగా పెరిగింది. పాత ట్రాన్స్‌ఫార్మర్‌పై అధిక భారం పడటంతో పీక్‌ సమయాల్లో సరఫరా అంతరాయాలు, ఓవర్‌లోడింగ్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉండేది. నూతన 8 ఎంవీఏ పీటీఆర్‌ అందుబాటులోకి రావడంతో ఈ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే వీలు కలుగుతుందని అధికారులు వెల్లడించారు.

రైతులకు మరింత భరోసా

సామర్థ్య పెంపుతో వ్యవసాయ మోటార్లకు స్థిరమైన విద్యుత్‌ సరఫరా అందడంతోపాటు గృహ, వాణిజ్య వినియోగదారులకు మెరుగైన వోల్టేజ్‌ లభించే అవకాశం ఉంది. విద్యుత్‌ అంతరాయాలు, లోడ్‌ సమస్యలు తగ్గితే పంటల సాగు సమయంలో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులకు కొంతవరకు పరిష్కారం లభించనుంది.

సమన్వయంతో పనులు పూర్తి

డీఈ/ఆపరేషన్‌/జడ్చర్ల, ఏడీఈ/టీఆర్‌ఈ/జడ్చర్ల, ఏడీఈ/ఆపరేషన్‌/జడ్చర్ల, ఏఈ/అడ్డాకల్‌, ఏఈ/టీఆర్‌ఈ/జడ్చర్ల సమన్వయంతో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు, పరీక్షలు, ఛార్జింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు. తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకత్వంలో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచుతూ వినియోగదారులకు నాణ్యమైన, విశ్వసనీయమైన విద్యుత్‌ అందించేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు టీజీఎస్పీడీసీఎల్‌ అధికారులు తెలిపారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder