సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్: నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన ఐకియా జంక్షన్లో పాదచారుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం జంక్షన్ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, మెట్రోతో పాటు ఇతర ప్రజా రవాణా మార్గాల ద్వారా వచ్చే ప్రయాణికుల కదలికలను పరిశీలించారు. మెట్రో నుంచి దిగిన చాలామంది ప్రయాణికులు జీబ్రా క్రాసింగ్లు, నిర్దేశిత పాదచారుల మార్గాలను ఉపయోగించకుండా నేరుగా ప్రధాన రహదారిని దాటుతున్న విషయాన్ని జేసీపీ గుర్తించారు. కార్యాలయానికి లేదా ఇంటికి త్వరగా చేరుకోవాలనే ఆతృతలో వేసే ఒక్క తప్పటడుగు ప్రాణాలకే ప్రమాదంగా మారవచ్చని అధికారులు పేర్కొన్నారు. పాదచారులు నిర్దేశిత ప్రాంతాల్లోనే రోడ్డు దాటేలా నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సన్ప్రీత్ సింగ్ ఆదేశించారు. రోడ్డు క్రమశిక్షణను మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రాంతాల్లో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ట్రాఫిక్ అధికారులకు సూచించారు. అనంతరం ఐటీసీ ఫ్రీ లెఫ్ట్ టర్న్ను పరిశీలించిన ఆయన, అక్కడి వాహనాల రాకపోకలు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న రహదారి మౌలిక సదుపాయాల పనితీరును సమీక్షించారు. ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అవసరమైన ఇంజినీరింగ్ మార్పులు, నిర్వహణ చర్యలను వెంటనే అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారి వెంట అనుమతి లేకుండా నిలిపిన క్యాబ్లు ట్రాఫిక్కు అడ్డంకిగా మారుతున్నట్లు గుర్తించారు. అక్రమంగా పార్కింగ్ చేసిన వాహనాలను తక్షణమే తొలగించడంతో పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఎన్ఫోర్స్మెంట్ బృందాలకు సూచించారు. రోడ్డు అనేది వాహనదారులదే కాదు.. పాదచారులదీ. అధికారుల ఇంజినీరింగ్ చర్యలు, పోలీసుల నిబంధనల అమలు, ప్రజల బాధ్యత—ఈ మూడూ కలిసినప్పుడే ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా గమ్యం చేరుకోగలడని జేసీపీ స్పష్టం చేశారు. 
ఐకియా జంక్షన్లో అడ్డదారులకు చెక్.. అక్రమ క్యాబ్ పార్కింగ్పై స్పెషల్ డ్రైవ్!