- నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్లో కీలక నియామకం
- ఏడాది పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ యాక్టివిస్ట్ విభాగానికి నాయకత్వం
- ప్రజల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తానన్న మురుగేశన్ వేళు
సామాన్యుడి అస్త్రం / శేరిలింగంపల్లి : సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న మురుగేశన్ వేలుకు కీలక బాధ్యత దక్కింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ (రిజి.) తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ యాక్టివిస్ట్ విభాగం చైర్మన్గా ఆయన నియమితులయ్యారు.
సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మఖ్తాబ్ రాయ్ ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థలో భాగంగా మురుగేశన్ వేళు ఏడాది పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ యాక్టివిస్ట్ విభాగానికి నాయకత్వం వహించనున్నారు.
సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో బలమైన ఆయుధమని, దాని వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సంస్థ సూచించింది. ముఖ్యంగా యువత, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు, చిన్నారులకు వారి హక్కుల గురించి తెలియజేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని పేర్కొంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలంటే ఆర్టీఐ చట్టాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయి బాధ్యతలు చేపట్టిన మురుగేశన్ వేళుపై కీలక బాధ్యతే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన సంస్థ జాతీయ నాయకత్వానికి మురుగేశన్ వేళు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తానని, సమాచార హక్కు చట్టంపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు. ఆయన నియామకం పట్ల పలువురు సామాజిక కార్యకర్తలు, ఆర్టీఐ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.