Crime

బాబాయ్‌ హోటల్‌లో పారిశుద్ధ్య లోపాలు.. కిచెన్‌లో పగిలిన ఫ్లోరింగ్‌, డ్రెయిన్లలో ఆహార వ్యర్థాలు!

బాబాయ్‌ హోటల్‌లో పారిశుద్ధ్య లోపాలు.. కిచెన్‌లో పగిలిన ఫ్లోరింగ్‌, డ్రెయిన్లలో ఆహార వ్యర్థాలు!
  • ఫుడ్‌ హ్యాండ్లర్ల వైద్య రికార్డులు, ఆహార పరీక్షల నివేదికలు లేవని గుర్తింపు
  • డిష్‌వాషింగ్‌ ప్రాంతంలో నీటి నిల్వ, దుర్వాసన.. డ్రెయిన్లలో ఆహార వ్యర్థాలు
  • ఫోస్‌కోస్‌ తనిఖీలో 98 మార్కులకు 69.. లోపాల సవరణకు నోటీసు జారీ

సామాన్యుడి అస్త్రం / మదీనాగూడ : ప్రజలకు ఆహారం అందించే హోటళ్లలో పరిశుభ్రతకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రశ్నను మరోసారి తెరపైకి తెచ్చేలా మదీనాగూడలోని బాబాయ్‌ హోటల్‌లో పలు లోపాలు బయటపడ్డాయి. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆహార భద్రత అధికారులు నిర్వహించిన తనిఖీలో కిచెన్‌, డిష్‌వాషింగ్‌ ప్రాంతం, ఆహార నిల్వ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. తనిఖీ సమయంలో హోటల్‌లో పనిచేస్తున్న ఫుడ్‌ హ్యాండ్లర్లకు సంబంధించిన వైద్య రికార్డులు అందుబాటులో లేవని అధికారులు గుర్తించారు. వడ్డిస్తున్న ఆహార పదార్థాలకు సంబంధించిన పరీక్షల నివేదికలు కూడా చూపించలేదని పేర్కొన్నారు. ఆహారం తయారు చేసే సిబ్బంది ఆరోగ్య పరిస్థితి, పదార్థాల నాణ్యతను నిర్ధారించే రికార్డులు లేకపోవడాన్ని అధికారులు ప్రధాన లోపంగా నమోదు చేశారు.

నీటి నిల్వ.. డ్రెయిన్లలో వ్యర్థాలు

డిష్‌వాషింగ్‌ ప్రాంతంలోని ఫ్లోరింగ్‌ సమతలంగా లేకపోవడంతో నీరు నిలిచి దుర్వాసన వస్తున్నట్లు తనిఖీలో వెల్లడైంది. కొన్ని ప్రాంతాల్లో కిచెన్‌ ఫ్లోరింగ్‌ పగిలిపోయి ఉండటంతో శుభ్రపరచడం కష్టమవుతోందని అధికారులు గుర్తించారు. డ్రెయిన్లలో పేరుకుపోయిన ఆహార వ్యర్థాలను తొలగించకపోవడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. కిచెన్‌లోని ఎగ్జాస్ట్‌కు జిడ్డు పేరుకుపోయిందని, దానిని పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని ఆదేశించారు. ముందుగా సిద్ధం చేసి ఉంచిన పూరీ, పూర్ణం వంటి సెమీ-ప్రిపేర్డ్‌ ఆహార పదార్థాలపై తయారీ సమయం, వినియోగ గడువు తదితర వివరాలతో లేబుళ్లు లేకపోవడాన్ని కూడా నమోదు చేశారు.

Image

అందుబాటులో ఉన్న కొన్ని రికార్డులు

హోటల్‌లో పెస్ట్‌ కంట్రోల్‌, ప్యాకేజింగ్‌, నీటి పరీక్షలకు సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉండటాన్ని అధికారులు మంచి పద్ధతిగా పేర్కొన్నారు. అయితే ఇతర పారిశుద్ధ్య, రికార్డు నిర్వహణ లోపాల కారణంగా ఫోస్‌కోస్‌ తనిఖీలో హోటల్‌కు 98 మార్కులకు 69 మార్కులు, అంటే 71 శాతం స్కోరు లభించింది. గుర్తించిన లోపాలపై అధికారులు హోటల్‌ యాజమాన్యానికి నోటీసు జారీ చేశారు. నిర్దేశించిన ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా లోపాలను సరిదిద్దాలని ఆదేశించారు. నోటీసు తర్వాత లోపాలను ఎంతకాలంలో సరిచేశారు, అధికారులు పునఃతనిఖీ నిర్వహిస్తారా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

Image

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder