- దెబ్బతిన్న రోడ్లు, గుంతలు, నీటి నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక కార్యాచరణ
- ఫ్రీలెఫ్ట్లు, ట్రాఫిక్ సిగ్నళ్లు, ఫుట్పాత్ల అభివృద్ధికి నిర్ణయం
- సమస్యలను కాలపరిమితితో పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ ఆదేశం
సామాన్యుడి అస్త్రం / సైబరాబాద్ : వర్షాకాలంలో రోడ్లపై నీటి నిల్వలు, గుంతలు, ట్రాఫిక్ బాటిల్నెక్స్తో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ పోలీసులు అన్ని భాగస్వామ్య శాఖలను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. వర్షాకాల సన్నద్ధత, రహదారి అభివృద్ధి, ట్రాఫిక్ నిర్వహణపై ఆగస్టు 10న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎంసీ కమిషనర్ శ్రీజన, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఎండీ అశోక్రెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్, టీజీఐఐసీ వీసీ అండ్ ఎండీ కె.శశాంక, ట్రాఫిక్ జాయింట్ సీపీ సన్ప్రీత్సింగ్, ట్రాఫిక్–2 డీసీపీ శేషాద్రిణిరెడ్డితోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గుంతలు కనిపిస్తే తక్షణ మరమ్మతులు
తీవ్రంగా దెబ్బతిన్న రహదారులు, గుంతలున్న ప్రాంతాలను గుర్తించి ప్రాధాన్య క్రమంలో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ట్రాఫిక్కు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ఇతర యుటిలిటీ మౌలిక వసతులను తరలించడంతోపాటు రద్దీ ప్రాంతాల్లో రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.

వాటర్లాగింగ్పై ఉమ్మడి యుద్ధం
వర్షం కురిసిన ప్రతిసారీ నీరు నిలుస్తున్న ప్రాంతాలను ట్రాఫిక్ పోలీసులు గుర్తించి సంబంధిత శాఖల దృష్టికి తీసుకొచ్చారు. డ్రైనేజీ లోపాలు, నాలాల ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించారు. సీఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, హైడ్రా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు.
ఫ్రీలెఫ్ట్లు.. సిగ్నళ్లకు కొత్త రూపు
అవసరమైన కూడళ్లలో కొత్త ఫ్రీలెఫ్ట్ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న వాటి విస్తరణ, పనిచేయని ట్రాఫిక్ సిగ్నళ్ల పునరుద్ధరణపై చర్చించారు. ముఖ్యమైన జంక్షన్లలో కొత్త సిగ్నళ్లు, పాదచారుల కోసం మెరుగైన ఫుట్పాత్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఎంసీ, ట్రాఫిక్ పోలీసులు గుర్తించిన పనులను త్వరగా పూర్తి చేస్తామని కమిషనర్ శ్రీజన హామీ ఇచ్చారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, టీజీఎస్పీడీసీఎల్, హైడ్రా, టీజీఐఐసీ, హెచ్జీసీఎల్, ఆర్అండ్బీ, ఎన్హెచ్ఏఐ, ఎంఓఆర్టీహెచ్ శాఖలు సమన్వయంతో, నిర్ణీత గడువులో సమస్యలను పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు.
