Telangana

10K రన్‌ ఎఫెక్ట్‌.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ చక్రబంధం!

10K రన్‌ ఎఫెక్ట్‌.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ చక్రబంధం!
  • కేబుల్‌ బ్రిడ్జి, గచ్చిబౌలి మార్గాల్లో భారీగా నిలిచిపోయిన వాహనాలు
  • ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌, రాయదుర్గం, ఐకియా రూట్లపై తీవ్ర ప్రభావం
  • ముందస్తు సమాచారం లేక ఇబ్బందులు పడ్డామని వాహనదారుల ఆవేదన
సామాన్యుడి అస్త్రం / హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో నిర్వహించిన 10K రన్‌ ప్రభావంతో ఆదివారం ఉదయం ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రన్‌ నేపథ్యంలో పోలీసులు పలు ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించడంతో మాదాపూర్‌, రాయదుర్గం, గచ్చిబౌలి పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మాదాపూర్‌ కేబుల్‌ బ్రిడ్జి, గచ్చిబౌలి ఫ్లైఓవర్‌, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వైపు వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. మాదాపూర్‌ ఫైర్‌ స్టేషన్‌ నుంచి జూబ్లీ జంక్షన్‌ వరకు వాహనాలు నెమ్మదిగా కదిలాయి. టెక్‌ మహీంద్రా, లెమన్‌ ట్రీ హోటల్‌, రాయదుర్గం మార్గాల్లోనూ ట్రాఫిక్‌ ప్రభావం స్పష్టంగా కనిపించింది.

ఐకియా మీదుగా గచ్చిబౌలి స్టేడియం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. సాధారణంగా కొన్ని నిమిషాల్లో చేరుకునే ప్రాంతాలకు ఎక్కువ సమయం పట్టిందని పలువురు అసహనం వ్యక్తం చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద వాహనాల ఒత్తిడి పెరగడంతో అనుసంధాన రహదారులపైనా ట్రాఫిక్‌ ప్రభావం పడింది.

ప్రజా కార్యక్రమాలు నిర్వహించడం మంచిదే అయినప్పటికీ, సామాన్య వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా పటిష్ఠమైన ట్రాఫిక్‌ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మళ్లింపుల వివరాలను ముందుగానే విస్తృతంగా ప్రచారం చేయాలని కోరుతున్నారు.

రద్దీ కొనసాగుతున్న మార్గాలను తప్పించి ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణించాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చే వారు ట్రాఫిక్‌ పరిస్థితిని తెలుసుకున్న తర్వాతే ప్రయాణం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

Related News సంబంధిత వార్తలు

Advertisement 728 x 90 Banner Placehoder